భక్తిసాగరంలో ముంచెత్తిన అయోధ్యకాండ అఖండ పారాయ‌ణం

లోక‌క‌ల్యాణం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌లలోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై మంగ‌ళ‌వారం ఉదయం జరిగిన 11వ విడ‌త అయోధ్యకాండ అఖండ పారాయణం భక్తులను భక్తిసాగరంలో ముంచెత్తింది. ఉదయం 7 నుంచి 9 గంటల వరకూ జరిగిన ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేసింది. అయోధ్యకాండలోని 40 నుంచి 44వ‌ సర్గ వ‌ర‌కూ మొత్తం నాలుగు స‌ర్గల్లో 159 శ్లోకాలు, యోగ‌వాశిష్టం మ‌రియు ధ‌న్వంత‌రి మ‌హామంత్రంలోని 25 శ్లోకాలు క‌లిపి మొత్తం 184 శ్లోకాల‌ను పారాయణం చేశారు.

ధర్మగిరి వేద పాఠశాల పండితులు డా. రామానుజాచార్యులు, శ్రీ అనంత గోపాలకృష్ణ, డా. మారుతి శ్లోక పారాయ‌ణం చేశారు. అఖండ పారాయ‌ణంలో ధ‌ర్మగిరి వేద పాఠ‌శాల, ఎస్వీ వేద విశ్వవిద్యాల‌యం అధ్యాప‌కులు, ఎస్వీ ఉన్నత వేదాధ్యయ‌న సంస్థకు చెందిన వేదపారాయ‌ణదారులు, జాతీయ సంస్కృత విశ్వవిద్యాల‌యానికి చెందిన శాస్త్ర పండితులు పాల్గొన్నా‌రు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ శ్రీనివాస్ బృందం “శ్రీరామ నీనామ మేమిరుచిరా ఓరామ నీనామ మెంతరుచిరా..” అనే కీర్తనను కార్యక్రమ ప్రారంభంలో, “రామ రామ యనరాదా రఘుపతి, రక్షకుడని వినలేదా..” అనే నామ సంకీర్తనను చివరిలో రసరమ్యంగా ఆలపించారు.

Share this post with your friends