తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి జ్యేష్ఠాభిషేకం ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గోవిందరాజ స్వామివారి ఆలయంలో జరుగుతున్న జ్యేష్ఠాభిషేకంలో రెండో రోజైన బుధవారం కవచ ప్రతిష్ట వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఆలయంలో ఉదయం శతకలశస్నపనం, మహాశాంతి హోమం చేపట్టారు. అనంతరం ఆలయంలోని కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజ స్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు.
అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి కవచ ప్రతిష్ట చేశారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాఢ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ ముని కృష్ణారెడ్డి, సూపరింటెండెంట్లు శ్రీ నారాయణ, శ్రీ మోహన్ రావు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ ధనంజయులు, శ్రీ రాధాకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.