తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి 30 కోట్ల రూపాయలను కేటాయించనుంది. ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సిఫారసు మేరకు తీసుకోబడినట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కొండగట్టు హనుమంతునికి భక్తుడు. తనను కొన్ని సందర్భాల్లో ఆయనే రక్షించారని పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత భక్తి కారణంగా ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చారు. ఇక ఈ ఆలయం 300–500 సంవత్సరాల పురాతనమైనదని నమ్ముతారు. స్థానికులకు హనుమంతుడు కలలో దర్శనమిచ్చి ఆలయాన్ని నిర్మింపజేసుకున్నారని స్థలపురాణం. టీటీడీ ఒక రాష్ట్రానికి పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న హిందూ దేవాలయాలకు మద్దతు ఇస్తూ, వాటి అభివృద్ధిలో భాగమవుతున్నది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని కొండగట్టు అంజన్న దేవాలయానికి కూడా నిధులు ఇచ్చేందుకు సంసిద్దత తెలిపినట్టు తెలుస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో కొన్ని వర్గాలు వ్యతిరేకించినా.. ప్రాంతీయ విభేదాల కంటే ఐక్యత, అభివృద్దిపై దృష్టి పెట్టడమే టీటీడీ ఉద్దేశం. సనాతన ధర్మాన్ని దశదిశలా వ్యాపింపజేయడమే లక్ష్యంగా నిధులు మంజూరు చేసేందుకు సిద్దమౌతున్నది.

