
యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ఆలయ స్థల పురాణం గురించి తెలుసుకుందాం. ఋష్యశృంగ మహర్షి, శాంత దంపతుల పుత్రుడే.. యాద మహర్షి. ఆయనకు చిన్నప్పటి నుంచి ఉగ్ర రూపుడైన నరసింహ స్వామిని చూడాలనే కోరిక ఉండేదట. తన మనోభిష్టాన్ని ఎలాగైనా నెరవేర్చుకోవాలనే తపనతో లక్ష్మీ నరసింహస్వామి గురించి తపస్సు చేయాలని యాద మహర్షి భావించాడు. యాద మహర్షి తపః ఫలంగానే ఈ యాదగిరిగుట్ట నరసింహ క్షేత్రం ఆవిర్భవించిందని ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది.
లక్ష్మీనరసింహస్వామి కోసం యాద మహర్షి.. ఒక సింహా కారంలో ఉన్న గుహలో తపస్సు చేశాడట. ఆ సమయంలో ఆ గుహకు ఆంజనేయస్వామి రక్షకుడుగా ఉన్నాడని చెబుతారు. అందుకే యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఆంజనేయస్వామి పూజలందుకుంటున్నాడు. గ్రహ పీడితులు, మానసిక వ్యాధులతో ఇబ్బంది పడేవారు ఇక్కడ ఆంజనేయస్వామిని దర్శించి పూజిస్తే అన్ని రకాల దోషాల నుంచి విముక్తులవుతారని విశ్వాసం. ఇక యాద మహర్షి తపస్సుకు ఫలితంగా నరసింహస్వామి 5 రూపాల్లో సాక్షాత్కరించాడట. ఆ ఐదు రూపాలేంటంటే.. జ్వాలా నరసింహుడు, యోగ నరసింహుడు, గండ భేరుండ నరసింహుడు, ఉగ్ర నరసింహుడు, లక్ష్మీ నరసింహుడు. మహర్షి కోరిక మేరకు స్వామివారు ఆ 5 రూపాల్లో వెలసి ఉండిపోయారని ఆలయ స్థల పురాణం చెబుతోంది.
