ఆలయం శిథిలమైనా భక్తి శాశ్వతమని చాటే అపూర్వ దృశ్యం ఇది. ప్రకాశం జిల్లా కందుకూరు మండలం జిల్లెలమూడి గ్రామ సమీపంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన జనార్ధనస్వామి ఆలయం కాలక్రమేణా కూలిపోయింది. అయితే ఆలయ ధ్వజస్తంభం మాత్రం చెక్కుచెదరకుండా నిలిచింది. ఆ ధ్వజస్తంభాన్ని వందల ఏళ్లుగా ఓ పవిత్ర మర్రిచెట్టు తన శాఖలతో ఆలింగనం చేసుకుని కాపాడుతూ రావడం భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆలయం లేకపోయినా, మూలవిరాట్టు మరోచోటికి తరలిపోయినా, ఈ ధ్వజస్తంభానికి నేటికీ భక్తులు పూజలు చేస్తున్నారు. వటవృక్షం హిందువులకు అత్యంత పవిత్రమని, ప్రళయకాలంలో శ్రీమహావిష్ణువు మర్రి ఆకుపై దర్శనమిచ్చాడని పురాణ విశ్వాసం. అందుకే ఆ చెట్టును నరకడం ఇష్టంలేక గ్రామస్థులు ధ్వజస్తంభాన్ని అలాగే వదిలేశారు. ఇది ప్రకృతి, భక్తి, సంప్రదాయాల మేళవింపుకు నిలువెత్తు నిదర్శనం.

