
మానవుని సంపూర్ణ ఆయుర్దాయం 120 సంవత్సరాలు అని జ్యోతిష్య శాస్త్రం చెబుతున్నది. 60 సంవత్సరాలు నిండినప్పుడు చేసుకునేది షష్టిపూర్తి. ప్రతివారికీ మృత్యువు 60 వ ఏట ‘ఉగ్రరథుడు’ అను పేరుతో, 70 వ ఏట ‘భీమరథుడు’ అను పేరుతో, 78 వ ఏట ‘విజయరథుడు’ అను పేరుతో ఎదురు చూస్తుంటాడు. ఆరోగ్య సమస్యలకు తట్టుకోవటానికి చేసే శాంతి ప్రక్రియ షష్టిపూర్తి. బృహస్పతి, శని 30 సంవత్సరాలకు మానవుని జన్మకాలంలో ఉన్నరాశికి చేరటానికి 60 సంవత్సరాలు పడుతుంది. వాళ్ళిద్దరూ తాము బయలుదేరిన రాశికి చేరుకోవటంతో మానవుని జీవితం మరలా ప్రారంభమవుతుంది.
తిరిగి జీవితం ప్రారంభం అయినట్లు సంకేతం. మానవుడు పుట్టిన తెలుగు సంవత్సరాలు (60) నిండుతాయి కనుక షష్టిపూర్తి. ఈ సందర్భంగా ఆయుష్కామన యజ్ఞము చేస్తారు. ఆయువును కోరి చేయు యజ్ఞము… ‘ఆయుష్కామనయజ్ఞము’. ఈ యజ్ఞాన్ని చేసే పద్ధతిని పెద్దలు ఇలా చెప్పారు. తెల్లని నూతన వస్త్రముపై తూర్పు దిక్కుగా 12 గీతలు గీసి వాటిమీద అయిదు అడ్డగీతలు గీసి మొత్తము 60 గదులు వచ్చే విధంగా చేస్తారు. వరుసకు 12 అయిదు వరుసలు తూర్పు దిక్కున బియ్యం పోసి కలశం ఉంచుతారు. ప్రభవ నుంచి క్షయ వరకూ 60 సంవత్సరాల అధిదేవతలతో ఆవాహన చేస్తారు.
