
షష్టిపూర్తి నాడు ప్రభవ నుంచి క్షయ వరకూ 60 సంవత్సరాల అధిదేవతలతో ఆవాహన చేస్తారని తెలుసుకున్నాం కదా. ఆ తరువాత ఏం చేస్తారో తెలుసుకుందాం. దక్షిణాయన, ఉత్తరాయణ దేవతలను, 6 ఋతువులను 12 మాసములను ఆవాహన చేస్తారు. పక్షములను, తిధులను, వారములను – వారదేవతలు అయిన – సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శనిని ఆవాహన చేస్తారు. వీరికి అధిదేవతలు – అగ్ని, జలము, భూమి, విష్ణువు ఇంద్రుడు, ప్రజాపతి లను ఆవాహన చేస్తారు – వీరికి అధిదేవతలు శివుడు, దుర్గ, కుమారస్వామి, బ్రహ్మ – ఇంకా ఏకాదశ రుద్రులు, నక్షత్ర దేవతలు 27 యోగములు 11 కరణములు.
ఇలా అందరి దేవి దేవతా స్వరూపాలని మృత్యుంజయుని ఆవాహన చేసి బ్రాహ్మణోత్తములు మంగళాచరనములతో వేదయుక్తంగా ఈ కార్యక్రమం జరిపిస్తారు. అపమృత్యు నివారణార్థం హోమాల్ని, జపములను కూడా చేస్తారు. తదుపరి బ్రహ్మణులను సత్కరించి బంధుమిత్రులతో విందు ఆరగిస్తారు. పూర్వకాలంలో పురుషుడు ఏ వేడుక చేసుకున్నా భార్యకు కూడా జరిగినట్టే భావించేవారు కనుక స్త్రీలకు మళ్ళీ విడిగా షష్టిపూర్తి చేసే ఆచారం లేదు. పెళ్లి సాధారణంగా జరగాలి. షష్టిపూర్తి ఘనంగా జరగాలని పెద్దల మాట. ఎందుకంటే షష్టిపూర్తి దృఢమైన ఆత్మీయతల సుగంధం పరిమళించే సందర్భం కనుక. బిడ్డలు తమ కృతజ్ఞతను తమ తల్లిదండ్రులకు అర్పించుకొనే అపురూప సందర్భం షష్టిపూర్తి.
