బ్రహ్మ కడిగిన పాదము.. బ్రహ్మము తానెడి పాదమూ అని అంటారు. అంటే.. శ్రీహరి పాదాల్లోనే మహిమలన్నీ దాగి ఉంటాయట. అయితే శ్రీవారి పాదాలను కేవలం సుప్రభాత సమయంలో మాత్రమే చూడగలం. మిగిలిన సమయంలో స్వామివారి పాదపద్మాలు ఎల్లవేళలా పుష్పాలు, తులసితో నిండి ఉంటాయి. అలాగే స్వామి వారి మూల విరాట్ నిజ పాదాలు బంగారంతో తయారు చేసిన కవచాలను తొడుగుతారు. తిరుమలకు కాలినడక మార్గంలో వెళ్లే వారు శ్రీ మలయప్ప స్వామివారి పాదాలను అలిపిరి ప్రదేశంలోని పాదాల మండపంలో కనిపిస్తుంది.

అలిపిరిలో క్రీ.శ .1628 కాలం నాటి ఈ పాదాల మండపం ఉంటుంది. ఈ పాదాల మండపంలో లెక్కలేనన్ని పాదరక్షలు కనిపిస్తాయి. ఈ పాదమండపంలోని పాదరక్షలన్నీ తరచుగా అరిగిపోతుంటాయని చెబుతారు. దీనికి కారణం.. భక్తులు సమర్పించిన ఈ పాదరక్షలను శ్రీవారు ఎంతో ప్రీతితో ధరిస్తారట. ధరించిన మీదట కొండ దిగి అలివేలు మంగమ్మ దగ్గరకి వెళ్లి తిరిగి కొండ ఎక్కే వేళ వాటిని ఇక్కడే వదిలి వెళతారని అంటారు. అందుకే ఈ చెప్పులు అరిగి పోయి ఉంటాయని పురాణ ఇతిహాసం. తిరుమలలోని శ్రీవారి ఆలయానికి సుమారు 2 కి.మీ దూరంలో ఉన్న నారాయణ పాదంలో శ్రీహరి పాదముద్రలున్న శిలాఫలకం కనిపిస్తుంది. ఇక్కడ పాద పూజ, ఛత్రస్థాపన వంటి ఉత్సవాలు నిర్వహిస్తారు.
