కొత్తకొండ వీరభద్రస్వామి అంటే భక్తుల మనసుల్లో ముందుగా గుర్తొచ్చేది రాచగుమ్మడికాయ. కోటీశ్వరుడైనా, కటిక పేదవాడైనా ఈ స్వామిని దర్శించుకోవాలంటే నెత్తిన గుమ్మడికాయ మోసుకురావాల్సిందే. కోరుకున్న కోరిక నెరవేరితే భక్తుడు తప్పకుండా రాచగుమ్మడికాయ సమర్పించి మొక్కు చెల్లిస్తాడు. ఈ సంప్రదాయం వెనుక గొప్ప పురాణ కథ ఉంది. దక్షయజ్ఞం సమయంలో వీరభద్రుడి ఉగ్రరూపాన్ని శాంతింపజేయడానికి కూష్మాండం అంటే రాచగుమ్మడికాయను సమర్పించారని పండితులు చెబుతారు. అప్పటినుంచి గుమ్మడికాయ స్వామికి మహా నైవేద్యంగా మారింది. సంక్రాంతి జాతర సమయంలో వేలాది మంది భక్తులు నెత్తిన గుమ్మడికాయ ఎత్తుకుని వీరన్న సన్నిధికి చేరుకుంటారు. మంత్రులు, అధికారులు సైతం భక్తుల్లా నిలబడి మొక్కులు చెల్లిస్తారు. గుమ్మడికాయలో భక్తి, వినయం, శరణాగతి దాగి ఉందని భక్తుల నమ్మకం. వీరభద్రుడి కృపతో కోరికలు నెరవేరతాయనడానికి ఈ గుమ్మడికాయనే సాక్ష్యం.

