శ్రీశైలం మల్లికార్జున స్వామి గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. పార్వతీమాతకు భ్రమరాంబికా దేవి అనే పేరు ఎందుకొచ్చింది? అలాగే శివయ్యకు మల్లికార్జునడనే పేరు ఎందుకు వచ్చిందనే విషయాలన్నింటినీ తెలుసుకున్నాం. ఇప్పుడు శ్రీశైల ఆలయం గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. శ్రీ మల్లికార్జునుని దేవాలయంలో మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగంగా పూజలందుకుంటున్న విషయం తెలిసిందే. ఇక్కడ భక్తులకు స్పర్శ దర్శనం అందుబాటులో ఉంటుంది. నాలుగు మండపములతో అపూర్వమైన శిల్ప సంపదతో శ్రీశైలం అలరారుతుంది. శ్రీశైలంలో మల్లిఖార్జునుని ఆలయంతో పాటుగా ఉన్న దర్శనీయ స్థలాల గురించి కూడా తెలుసుకుందాం.

శ్రీశైలం ద్వాదశ శక్తి పీఠాలలో ఒకటి మాత్రమే కాదు.. అష్టాదశ శక్తి పీఠాలలోనూ ఒకటిగా భాసిల్లుతోంది. ఇక్కడి అమ్మవారిని భ్రమరాంబికా దేవి అని పిలుస్తారని చెప్పుకున్నాం కదా. భ్రమరం అంటే తుమ్మెద. అమ్మవారి ఆలయంలోని గర్భాలయ వెనుక భాగమున గోడకు చెవి ఆనించి వింటే ఝమ్మనే భ్రమర నాదం వినిపిస్తుందట. ఇక ఇక్కడికి వెళ్లిన వారు తప్పనిసరిగా సాక్షి గణపతి ఆలయాన్ని దర్శించుకోవాలి. లేదంటే శ్రీశైలం వెళ్లిన ఫలితం కూడా దక్కదట. శ్రీశైలానికి 3 కి.మీ దూరంలో ఈ ఆలయం ఉంటుంది. ఇక్కడి సాక్షి గణపతిని దర్శించుకుంటే స్వామివారు వెళ్లి ఫలానా భక్తుడు శ్రీశైలానికి వచ్చామని మల్లికార్జునుడికి చెబుతాడట. కాబట్టి తప్పనిసరిగా సాక్షి గణపతిని దర్శించుకుని రావాల్సిందే.
