అరుణాచల కొండ తొలినాళ్లలో ఎలా ఉండేది.. ఆ తరువాతి కాలంలో ఎలా రూపాంతరం చెందిందనే విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. ప్రస్తుతం ఇది చూపరులకు సాధారణ కొండగా కనిపిస్తోంది. కానీ ఇది అంతర్గతంగా మాత్రం ఉజ్వలంగా ప్రకాశించే అగ్నిలింగంగా పేర్కొంటారు. ఈ విషయాన్ని పురాణాలు సైతం చెబుతున్నాయి. అందుకే అరుణాచలంలో గర్భాలయంలో స్వామివారి దర్శనం కంటే.. అరుణాచలం గిరి ప్రదక్షిణకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. ఈ అరుణాచలంలో ఉండే కొండ గుహల్లో ఎందరో మహర్షులు తపస్సు చేశారని చెబుతారు.

అంతేకాకుండా ఈనాటికీ కొందరు మహర్షులు కంటికి కనిపించని సూక్ష్మ రూపంలో తపస్సు చేసుకుంటూ ఉంటారని చెబుతారు. అరుణాచలం కొండ గుహల్లో సాధన చేసి సరస్వతి కటాక్షం పొందిన వారిలో కావ్యకంఠ గణపతి ముఖ్యులు కాగా.. ఆ తరువాత రమణ మహర్షుల వారు ఏకంగా అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఎన్నో గ్రంథాలను రచించి కఠోరమైన సాధనతో శివ సాక్షాత్కారాన్ని పొందారు. అరుణాచలంలో వెలిసిన శివయ్యను నిజమైన గురువని.. ఇలాంటి కొండ రూపం దాల్చిన గురువు లోకంలో పరమేశ్వరుడు తప్ప మరొకరు లేరని చెబుతారు. అందుకే ఎందరో మహర్షులు నిజమైన గురువు అరుణాచలం కొండగా భావించి ఇక్కడే స్థిరపడి మోక్షాన్ని పొందారు.
