జ్యోతిర్లింగాల గురించి మనం తెలుసుకుంటున్నాం. పరమేశ్వరుడు జ్యోతి రూపంలో వెలిసిన క్షేత్రాలే జ్యోతిర్లింగాలు. ప్రస్తుతం మనం రామేశ్వర క్షేత్రం గురించి తెలుసుకుంటున్నాం. ఇక్కడ శ్రీరాముడు, సీతాదేవి ప్రతిష్టించిన లింగాలు కూడా ఉన్నాయి. దశరథ మహారాజు జ్యేష్ఠ పుత్రుడు శ్రీరాముడు పితృవాక్య పరిపాలన కోసం 14 సంవత్సరాలు వనవాసం చేయ తలపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శ్రీరాముడు తన ధర్మపత్ని సీతాదేవి, సోదరుడు లక్ష్మణుడితో కలిసి దండకారణ్యంలో వనవాసం చేస్తాడు. ఆ సమయంలోనే రావణాసురుడు సీతమ్మను అపహరిస్తాడు.

ఆ తరువాత సీతమ్మను అన్వేషిస్తూ శ్రీరాముడు కిష్కింధకు చేరుకోగా… అక్కడ వానరరాజు సుగ్రీవుడితో మైత్రి చేస్తాడు. అలా శ్రీరాముడికి హనుమంతుడు తోడవుతాడు. సీత జాడ తెలుసుకోమని హనుమంతుడిని శ్రీరాముడు పంపగా.. లంకలో ఉన్న సీతమ్మను కనిపెట్టి శ్రీరాముడు ఇచ్చిన అంగుళీకమును సీతమ్మకు ఇచ్చి, ఆమెకు ధైర్యం చెప్పి వస్తాడు. అనంతరం శ్రీరాముడికి సీతమ్మ జాడను తెలియజేస్తాడు. అప్పుడు శ్రీరాముడు వానరుల సాయంతో రామేశ్వరం నుంచి సముద్రంపై రామసేతువును నిర్మించి లంకకు వెళ్లి రావణ సంహారం గావించి సీతమ్మను తీసుకుని వస్తాడు. అయితే రావణ సంహారం తర్వాత బ్రహ్మ హత్యా పాతకం నుంచి విముక్తి కోసం శివలింగాన్ని ప్రతిష్టించి తీసుకురమ్మని హనుమంతుడిని పంపిస్తాడు. కానీ ఆంజనేయుడు హిమామలయాల నుంచి శివలింగం తేవడం ఆలస్యమవడంతో సీతాదేవి ఇసుకతో తయారు చేసిన లింగాన్ని కూడా ప్రతిష్టించి పూజిస్తారు. ఈ విధంగా ఈ క్షేత్రంలో రెండు శివలింగాలు ఉండడం విశేషం.
