ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాకు 65 కిలోమీటర్ల దూరంలో కొలువైన మద్దిలేటి నరసింహస్వామి ఆలయం గురించి ఇప్పటికే చాలా విశేషాలు తెలుసుకున్నాం కదా. మద్దిలేటి నరసింహ స్వామి ఆలయంలో ప్రతి నిత్యం అర్చన, అష్టోత్తర పూజలు వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ ఆలయంలో ప్రతి శుక్ర, శనివారాల్లో విశేష పూజలు జరుగుతాయి. ఈ రెండు రోజులు ఆలయానికి భక్తులు పోటెత్తుతారు. ప్రతి ఏటా ముక్కోటి ఏకాదశి నాడు శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. స్వామివారి కల్యాణానికి పెద్ద ఎత్తున భక్తులు హారవుతారు.

స్వామివారి కల్యాణం సందర్భంగా మూడురోజుల పాటు ఉత్సవాలు, క్రీడలు నిర్వహిస్తారు. కార్తీక మాసంలో వచ్చిందంటే.. ఈ ఆలయంలో లక్ష తులసి పూజలు విశేషంగా నిర్వహిస్తారు. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే చాలు.. ఎలాంటి కోరిక అయినా నెరవేరుతుందని నమ్మకం. ముఖ్యంగా జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న వారు.. అవరోధాలతో విసిగిపోయిన వారు మద్దిలేటి నరసింహ స్వామివారిని దర్శించుకుంటే చాలట ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఈ ప్రాంత ప్రజలు స్వామివారిపై తమ భక్తిని చాటుకునేందుకు తమ పిల్లలకు స్వామివారి పేరును పెట్టుకుంటారు. కర్నూలు నుంచి నిత్యం బస్సు సౌకర్యం ఉంటుంది.
