పునర్జన్మ అనేది ఉంటుందా? సనాతన ధర్మం ప్రకారం అయితే ఉంటుందని నమ్ముతాం. కానీ ఇది ఎంతవరకూ నిజం? ఇదే అంశంపై విస్తృతమైన పరిశోధనలు, వాస్తవ సంఘటనలు జరిగాయని ఇస్కాన్ చెబుతోంది. ఇస్కాన్కు చెందిన ప్రణవానంద ప్రభుజీ తాజాగా మాట్లాడుతూ.. మానవులలో కూడా పూర్వజన్మల ఉనికికి అనేక ప్రమాణాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. డాక్టర్ ఇయాన్ స్టీవెన్సన్ అనే సైంటిస్ట్ దీనిపై అధ్యయనం చేశారు. దీనిలో భాగంగా 2500కు పైగా పునర్జన్మ సంబంధిత కేసులను అధ్యయనం చేసి డాక్యుమెంట్ చేశారు. ఆయన పరిశోధనలు పునర్జన్మ సిద్ధాంతానికి సైంటిఫిక్ ఆధారాన్ని జత చేస్తున్నాయని ప్రణవానంద తెలిపారు.

ముంబైలోని ఒక భగవద్గీత ప్రవచనంలో ప్రభుజీ వివరించారు. స్టీవెన్సన్ పుస్తకంలో పొందుపరిచిన ఒక కథలోని వ్యక్తి స్వయంగా అక్కడ హాజరై, తన పూర్వజన్మ జ్ఞాపకాలను పంచుకున్నట్టుగా వివరించారు. అలాగే, శ్రీల ప్రభుపాదుల కాలంలో ఒక భక్తుడు మళ్లీ జన్మించిన విషయాన్ని కూడా పునర్జన్మలున్నయనడానికి నిదర్శనంగా ఆయన పేర్కొన్నారు. అలాగే అమెరికాలో జరిగిన ట్విన్ టవర్స్ బ్లాస్ట్లో మరణించిన వ్యక్తి, తన తదుపరి జన్మలో ఆ ఘటనను వివరించడం గురించి కూడా ఆయన గుర్తు చేశారు. దానిని వీడియో ఫుటేజ్తో పోల్చి చూడగా నిజమని తేలిందని పేర్కొన్నారు. భారతదేశంలో కూడా ఒక మహిళ తన పూర్వజన్మ ఇంటిని, అత్తమామలను గుర్తుపట్టి, వారి ఇంటి నిర్మాణం గురించి చెప్పిన విషయాన్ని కూడా ప్రభుజీ ప్రస్తావించారు. కొందరు చిన్న పిల్లలు పూర్వజన్మ గురించి గుర్తుంచుకుంటారని.. కానీ కొందరు మరిచిపోతారన్నారు. దీనికి కారణం.. బొడ్డు తాడు తెగిన తర్వాత పూర్వజన్మ జ్ఞానం మరుగున పడటమేనన్నారు.
