అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం అని పిలుస్తారు. విష్ణు పురాణాల ప్రకారం ఈ నెలలో తీర్థయాత్రలు చేస్తే భక్తుల సమస్త పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుంది. ఇందులో పూరీ జగన్నాథ దేవాలయం ప్రత్యేకమైనది. బ్రహ్మ, స్కంద పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు…నీలమాధవుడిగా ఇక్కడ అవతరించాడు. అధిక మాసంలో జగన్నాథుని దర్శనం చేసుకోవడం వలన సుఖ, సంతోషాలు కలుగుతాయని నమ్ముతారు. ఆయన నేత్రాలను దర్శించడం ద్వారా సూర్య, చంద్ర దోషాలు తొలగిపోతాయి. మానసిక శాంతి, ఏకాగ్రత పెరుగుతుందనే నమ్మకం ఉంది. అధిక మాసంలో జగన్నాథుని దర్శనం చేసుకోవడం యజ్ఞాలు చేసినంత ఫలితాన్ని ఇస్తుంది. పూరీ క్షేత్రం నుంచి ప్రసాద బియ్యం తీసుకొచ్చి ఎండబెట్టాలి. వాటిని ఎర్రటి గుడ్డలో కట్టి బీరువాలో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందనే నమ్మకం ఉంది. అదేవిధంగా.. ఈ క్షేత్రం నుంచి తీసుకొచ్చిన బెత్తాన్ని ఇంట్లో ఉంచితే దుఃఖం ఇంట్లోకి ప్రవేశించదని పండితులు చెబుతున్నారు.

