కాశీలో విశ్వేశ్వరుడు, విశాలక్ష్మి దేవి ఆలయాలే కాదు.. చాలా ముఖ్యమైన ఆలయాలు మరికొన్ని ఉన్నాయి. కాశీలో అత్యంత ముఖ్యమైన ఆలయాల్లో కాశీ అన్నపూర్ణాదేవి ఆలయం ఒకటి. ఈ అన్నపూర్ణమ్మను దర్శించుకుంటే జీవితంలో ఆహారానికి ఏమాత్రం లోటుండదట. కాశీలో ఉన్న ఒక్క ప్రాణి కూడా ఆకలితో ఉండదని చెబుతారు. దానికి కారణం ఇక్కడ అన్నపూర్ణాదేవి కొలువుదీరి ఉండటమేనని చెబుతారు. కాశీలో దర్శించుకోవాల్సిన మరో ఆలయం సంకట మోచన్ హనుమాన్ ఆలయం. పేరులోనే సంకట మోచనుడని ఉంది కదా.. ఈ ఆలయాన్ని దర్శిస్తే ఎలాంటి సంకటాలైనా దూరమవుతాయని నమ్మకం.

కాశీలో దర్శించుకోవాల్సిన వాటిలో అత్యంత ముఖ్యమైనది కాలభైరవ స్వామి ఆలయం. ఈ స్వామివారిని కాశీ క్షేత్ర పాలకుడిగా పేర్కొంటారు. కాశీకి వెళ్లినవారు తప్పనిసరిగా ఈ స్వామివారిని దర్శించుకోవాలి. ఈ స్వామి దర్శనంతో ఏలినాటి శని దోషాలు తొలగి పోతాయని చెబుతారు. ఇక ఇక్కడి గంగా తీరంలో సుమారు 80కి పైగా స్నాన ఘాట్లు ఉన్నాయి. వీటిలో మణికర్ణికా ఘాట్, హరిశ్చంద్ర ఘాట్, దశాశ్వమేథ ఘాట్ వంటివి చాలా ముఖ్యమైనవి. మరణించిన కుటుంబ సభ్యులకు కాశీలోని పవిత్ర ఘాట్లలో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తే పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.
