దక్షిణ భారతంలో నరసింహుని క్షేత్రాలకు కొదువ లేదు. తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి స్తంభాన్ని చీల్చుకుని మరీ నరసింహుడు వచ్చిన కథ గురించి తెలిసిందే. నరుడు, జంతువు రూపంలో నరసింహుడిగా స్వామివారు అవతరించారు. అయితే హిరణ్యకశ్యపుని సంహారం తరువాత అనేక ప్రాంతాల్లో నరసింహుడు సంచరించాడని చెబుతారు. స్వామివారు ఎక్కడెక్కడైతే సంచరించారో ఆయన క్షేత్రం వెలిసింది. అయితే అన్ని క్షేత్రాల్లో కెల్లా ఒక్క క్షేత్రంలో మాత్రం స్వామివారి ఉనికి మాత్రం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఆ క్షేత్రం ఎక్కడుంది? దాని విశేషాలేంటో తెలుసుకుందాం.

ఆ క్షేత్రం మరెక్కడో లేదు.. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాకు 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ వెలిసిన నరసింహస్వామిని మద్దిలేటి నరసింహస్వామిగా పిలుస్తారు. ఇది ప్రముఖ వైష్ణవ క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడి నరసింహుడి క్షేత్రం ఆధ్యాత్మిక పరంగానే కాకుండా.. ప్రకృతి పరంగా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. పచ్చని ప్రకృతి.. కొండ కోనల నడుమ ఉన్న సెలయేళ్లు తప్ప ఇక్కడ వేరే శబ్దాలు వినిపించవు. ఈ ప్రాంతమంతా ప్రశాంత వాతావరణంలో ఉంటుంది. ఈ ఆలయానికి మద్దిలేటి నరసింహ స్వామి ఆలయమని పేరెందుకు వచ్చిందంటే.. మద్దులేటి వాగు పక్కనే కొలువై ఉండటమే దీనికి కారణం.
