కార్తికమాసం పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది. ఈ మాసంలో శివయ్య అనుగ్రహం పొందడం చాలా సులువని చెబుతారు. తెలిసో తెలియకో దీపారాధన చేసినా.. నదీ స్నానమాచరించినా.. ఏదైనా దానం చేసినా కూడా శివయ్య అనుగ్రహం లభిస్తుందని చెబుతారు. భోళాశంకరుడైన శివుడిని మెప్పించడం చాలా సులువు. ఒక్క నారికేళం అంటే కొబ్బరికాయ చాలట.. వాస్తవానికి భగవంతుడి పూజలో కొబ్బరికాయకు విశిష్ట స్థానం ఉంది. కొబ్బరికాయ కొట్టనిదే పూజ పూర్తి కాదు. అసలు దేవుడి పూజలో కొబ్బరికాయ ఎందుకు కొడతారో ముందుగా తెలుసుకుందాం.

భగవంతుని ఎదుట అహంకారం పనికిరాదట. దాన్ని త్యజించి స్వచ్ఛమైన మనసుతో పూజ నిర్వహించాలి. కాబట్టి కొబ్బరికాయ కొట్టడం అనేది మనలోని అహాన్ని త్యజించి స్వచ్ఛమైన మనసును భగవంతుడికి సమర్పించే ఆధ్యాత్మిక ఆచారమని చెబుతారు. కొబ్బరికాయ కొట్టడమంటే మనల్ని మనం భగవంతుడికి అంకితం చేసుకోవడమేనట. మనసులో ఏమైనా కల్మషం, ఈర్ష్యాద్వేషాల వంటివి ఏమున్నా కూడా కొబ్బరికాయ కొడితే అన్నీ తొలగిపోతాయట. కొబ్బరికాయకు అంతటి విశిష్టత ఉంది కాబట్టి స్వచ్ఛమైన నారికేళంతో కార్తిక మాసంలో దీపారాధన చేస్తే శివానుగ్రహం వేగంగా లభిస్తుందట.
