ముందుగా పంచ కేదారాలని వేటిని అంటారో ముందుగా తెలుసుకుందాం. ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్, రుద్రనాథ్, కల్పేశ్వర్, మధ్యమహేశ్వర్, తుంగనాథ్ ఈ ఐదింటిని పంచ కేదారాలుగా పిలుస్తారు. వీటి వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ గురించి తెలుసుకుందాం. కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులు లక్షలాది మంది శత్రు సైన్యం సహా కౌరవులందరినీ సంహరించి యుద్ధంలో విజయం సాధించారు. సంహరించిన వారిలో చాలా మంది బ్రాహ్మణులు కూడా ఉన్నారు. దీంతో వారికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తి కోసంపాండవులు వారణాసికి వెళ్లి పరమేశ్వరుడిని ప్రార్థించారు.

పాండవులు వారణాసికి వెళ్లినా ఫలితం దక్కలేదు. ఎందుకోగానీ వారిని విశ్వనాథుడు అనుగ్రహించలేదు. పైగా శివుడు పాండవుల నుంచి తప్పించుకునే క్రమంలో నంది అంటే ఎద్దు రూపంలో అక్కడ నుంచి దేవభూమి ఉత్తరాఖండ్కు పారిపోయాడట. అక్కడ పచ్చి గడ్డి మేస్తున్న ఎద్దుల సమూహంలో చేరి దాక్కున్నాడంట. అప్పుడు పాండవులు సైతం శివుడిని వెంటాడుతూ ఉత్తరాఖండ్కు వెళ్లారట. అక్కడ ఎద్దు రూపంలో వాటి సమూహంలో దాక్కొన్ని శివుడిని భీముడు గుర్తించాడట. ఎద్దు కాళ్లను, తోకను తన శక్తితో పట్టుకునే ప్రయత్నం చేయగా శివుడు భూమిలోకి అదృశ్యమయ్యే యత్నం చేశాడట. అప్పుడు శివుని శరీర భాగాలు ఐదు ప్రాంతాల్లో పడిపోయాయట. అవే పంచకేదారాలు.
