మధ్యప్రదేశ్లోని పవిత్ర క్షేత్రం ఉజ్జయినిలో విరాజిల్లే శ్రీ మహాకాళేశ్వర ఆలయంలో మహాశివరాత్రి వేళ దివ్యమైన ఆధ్యాత్మిక వైభవం దర్శనమిస్తుంది. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన మహాకాళేశ్వరుని ఆలయంలో సంవత్సరంలో ఒక్కసారే మధ్యాహ్నం నిర్వహించే భస్మ హారతి భక్తులకు అపూర్వ దర్శనంగా చెబుతారు. సాధారణంగా ఉదయం జరిగే ఈ మహా పూజ, శివరాత్రి మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు జరుగుతుంది. చితాభస్మంతో స్వామివారికి హారతి సమర్పించే ఈ క్షణం జీవన నశ్వరత్వాన్ని గుర్తుచేసి, భక్తిలో లీనమవ్వమని ఉపదేశిస్తుంది. ఈ సందర్భంగా మహాకాళుడిని 11 అడుగుల ఎత్తైన పుష్ప కిరీటంతో వరుడిగా అలంకరిస్తారు. ఏడు రకాల ధాన్యాలతో ప్రత్యేక పూజలు చేసి, బంగారు వెండి ఆభరణాలతో శోభాయమానంగా తీర్చిదిద్దుతారు. ఆ సమయంలో ఆలయ ప్రాంగణం హరహర మహాదేవ అనే నినాదాలతో మారుమోగిపోతుంది. నంది మండపం నుంచి గణేశ మండపం వరకూ భక్తులతో కిక్కిరిసిపోతుంది. ఈ మధ్యాహ్న భస్మ హారతి దర్శనం చేసుకుంటే జన్మసాఫల్యమౌతుందని భక్తుల విశ్వాసం.

