
ప్రముఖ వైష్ణవాచార్యులు శ్రీ తిరుమలనంబి 1052వ అవతార మహోత్సవాన్ని ఆదివారం తిరుమలలోని దక్షిణ మాడ వీధిలో గల శ్రీ తిరుమలనంబి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ తిరుమలనంబి ఆలయంలో 16 మంది ప్రముఖ పండితులు శ్రీ తిరుమల నంబి జీవిత చరిత్రపై ఉపన్యసించారు. భగవద్రామానుజుల వారికి స్వయాన మేనమామ, గురుతుల్యులు, శ్రీవారి భక్తాగ్రేసరులలో ఒకరైన శ్రీ తిరుమలనంబి శ్రీ వేంకటేశ్వరస్వామివారికి తీర్థ కైంకర్యం ప్రారంభించారని పేర్కొన్నారు.
ఆచార్య పురుషుడిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ తిరుమలనంబి శ్రీవేంకటేశ్వరస్వామివారి అభిషేకానికి సంబంధించిన పవిత్ర జలాలను తీసుకొచ్చి విశేష సేవ చేశారని తెలిపారు. హరికథా పితామహునిగా పేరున్న అజ్జాడ ఆదిభట్ల నారాయణదాస 160వ జయంతిని పురస్కరించుకుని తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల ప్రాంగణంలో ఆయన విగ్రహానికి ఆదివారం ఉదయం కళాశాల ప్రిన్సిపాల్ డా.ఉమా.ముద్దుబాల, డిపిపి సెక్రటరీ శ్రీ శ్రీరామ్ రఘునాథ్లు ఘనంగా పుష్పాంజలి సమర్పించారు.
