
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆనవాయితీగా నిర్వహించే బంగారు గొడుగు ఉత్సవం నిన్న అత్యంత వైభవంగా జరిగింది. మంగళవారం సాయంత్రం తిరుమలలోని కల్యాణకట్టలోని ప్రధాన బిల్డింగ్లో ఈ ఉత్సవాన్ని అర్చకులు అత్యంత ఘనంగా నిర్వహించారు. అక్టోబర్ 1వ తేదీ బుధవారం శ్రీవారి రథోత్సవాన్ని పురస్కరించుకొని అనాదిగా వస్తున్న ఆచార సంప్రదాయం మేరకు ముందు రోజు సాయంత్రం శ్రీవారి కల్యాణకట్ట సిబ్బంది ఆధ్వర్యంలో నూతన ఛత్రస్థాపనాన్ని చేస్తారు.
చారిత్రక నేపథ్యంలో శ్రీకృష్ణదేవరాయలు కాలంలో చంద్రగిరిరాజు శ్రీనివాస మహదేవ రాయలు చేసిన ధర్మ శాసనం ప్రకారం పంతులుగారి వంశస్తులు ఈ హక్కును కొన్ని శతాబ్దాలుగా అనుసరిస్తూ వస్తున్నారు. తొలి రోజుల్లో కొయ్య గొడుగుతో ప్రారంభమై, అటు తరువాత 1952 నుండి రథానికి బంగారు గొడుగు సమర్పించడం జరుగుతున్నది. కాగా పంతులుగారి ప్రస్తుత వంశీకుడైన పంతులుగారి శ్రీ రామనాథన్ ఆధ్వర్యంలో కల్యాణకట్ట క్షురకులు, సిబ్బంది, సభ్యులు ఈ కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం తిరుమలలో నిర్వహించారు.
