వేద నారాయణుని ఆలయ విశేషాలు, నిర్వహించే సేవలు ఏంటంటే..

చిత్తూరు జిల్లాలోని నాగలాపురం వేదనారాయణుని ఆలయ విశేషాలు చాలానే తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఆలయ విశేషాలు, బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏ ఏ రోజున ఏ ఏ సేవలు నిర్వహించనున్నారో తెలుసుకుందాం. చోళరాజుల తర్వాత శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారట. రాయల వారే ఈ గ్రామానికి తన తల్లి నాగమాంబ పేరిట నాగమాంబాపురంగా నామకరణం చేశాడట. అది కాస్తా కాలక్రమంలో నాగలాపురం అయ్యింది. ఆలయ ప్రాంగణంలో అనేక ఉప ఆలయాలు, దేవతా మూర్తుల ఆలయాలున్నాయి. ఇక్కడ దక్షిణామూర్తి సైతం కొలువై ఉండటం విశేషం.

15వ శతాబ్దంలో చోళరాజు ఈ ఆలయ ప్రాంగణంలోనే శివకేశవులకు అభేదాన్ని తెలుపుతూ దక్షిణామూర్తిని ప్రతిష్టించాడని చెబుతారు. ప్రతి ఏటా మార్చి 23, 24, 25 వ తేదీలలో సూర్య పూజోత్సవము.. మార్చి 26, 27, 28 వ తేదీలలో మూడు రోజుల పాటు తెప్పోత్సవాలు.. ఏప్రిల్ నెలలో పౌర్ణమి నుంచి 10 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇక నిత్య పూజలు యథావిధిగా ఉండనే ఉంటాయి. ఈ ఆలయం 1967 నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోకి వచ్చింది. టీటీడీ పరిధిలోకి వచ్చినప్పటి నుంచి ఇక్కడ నిత్య, వార, పక్ష, మాస, సంవత్సరోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఇక ఇవాళ బ్రహ్మోత్సవాల్లో భాగంగా వేదనారాయణుని గరుడోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. దీనిని కనులారా చూసిన వారి జన్మ ధన్యమని చెబుతారు.

Share this post with your friends