భక్తులకు టీటీడీ కీలక విజ్ఞప్తి

తిరుమలకు రాకపోకలు సాగించే కనుమ దారుల యందు ( ఘాట్ రోడ్డులలో) బీ.టీ రోడ్డు పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాహనదారులు మరింత అప్రమత్తంగా వాహనాలను నడపాలని తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తి చేస్తోంది. శ్రీవారి భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఘాట్ రోడ్డును మూసివేయకుండా నిర్దేశించిన సమయంలో మరమ్మత్తు పనులను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది. కనుక భక్తులు తమ తిరుమల ప్రయాణాన్ని ప్రణాళికబద్ధంగా మార్చుకుని కనీసం గంట సమయం ముందుగా ప్రారంభించాలని టీటీడీ కోరుతోంది. మరమ్మతుల కారణంగా వాహనదారులు నెమ్మదిగా అక్కడక్కడా కొద్ది సేపు ఆగుతూ ప్రయాణించాల్సి ఉంటుందనే విషయాన్ని భక్తులు గమనించగలరు.

భక్తులు మరింత సులభంగా, సౌకర్యంగా ప్రయాణించేందుకు ఈ మరమ్మతు పనులను టీటీడీ చేపట్టింది. ఈ నేపథ్యంలో భక్తులు రేణిగుంట విమానాశ్రయం, తిరుపతి రైల్వేస్టేషన్, ఆర్డీసీ బస్ స్టాండ్ ప్రాంతాల నుండి తిరుమల విచ్చేసే వాహనదారులు ముందస్తుగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని టీటీడీ సూచిస్తోంది. మరమ్మతు పనులను పూర్తి చేయడానికి టీటీడీలోని ప్రతి విభాగం అప్రమత్తంగా ఏర్పాట్లు చేపట్టింది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని వాహనదారులు తిరుమల చేరుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేయడమైనది. నిర్దేశించిన సమయంలో పనులు పూర్తి కావడానికి భక్తులు, వాహదారులు సహకరించాలని టిటిడి కోరుతోంది. అత్యవసర సేవలకు టీటీడీ టోల్ ఫ్రీ నెంబర్ 155257 కు సంప్రదించండి.

Share this post with your friends