ప్రముఖ ఆథ్యాత్మిక ప్రవచన కర్త బ్రహ్మర్షి డా.చాగంటి కోటేశ్వర రావు తిరుమల యాత్రలో భాగంగా టీటీడీలో అవమానం అంటూ దుష్ప్రచారం చేసిన సోషల్ మీడియా ప్రతినిధులపై తిరుపతి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో టీటీడీ ఫిర్యాదు చేసింది. దీంతో హైదరాబాద్ కేంద్రంగా ఉన్న డయల్ న్యూస్, పోస్ట్ 360, జర్నలిస్ట్ వైఎన్ఆర్ నిర్వాహకులపై తిరుపతి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అసలు ఏం జరిగిదనే విషయాన్ని టీటీడీ వెల్లడించినా కూడా ఆయా ఛానళ్ల వారు పదే పదే టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసేలా వాస్తవాలను వక్రీకరించి దురుద్దేశంతో అవాస్తవాలను ప్రచారం చేశారని ఫిర్యాదులో టీటీడీ పేర్కొంది. దీంతో సదరు ప్రతినిధులపై తిరుపతి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడంతో పాటు న్యూఢిల్లీలో, విజయవాడ లో గల పిఐబీ (ప్రెస్ ఇస్పర్మెషన్ బ్యూరో) వారికి ఫిర్యాదు చేసినట్టు టీటీడీ వెల్లడించింది.
అదేవిధంగా భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాగంటి కోటేశ్వర రావు గారి ఆధ్యాత్మిక అభిమానుల మనోస్థైర్యాన్ని పలుచన చేసేలా విష ప్రచారం చేసిన సదరు సోషల్ మీడియా సంస్థల లైసెన్స్ లను సైతం రద్దు చేయాలని యూట్యూబ్ మేటా మేనేజ్మెంట్ వారికి కూడా ఫిర్యాదు చేసింది. వాస్తవానికి చాగంటి కోటేశ్వర రావు జనవరి 14న శ్రీవారి దర్శనం, జనవరి 16వ తేదీ సాయంత్రం మహతి ఆడిటోరియంలో ప్రవచనాలు ఇచ్చేందుకు 2024, డిసెంబర్ 20న టీటీడీ ప్రొసిడింగ్స్ ఇచ్చింది. వారికి ఉన్న కేబినేట్ ర్యాంక్ ప్రోటోకాల్ ప్రివిలేజ్ ప్రకారం జనవరి 14న శ్రీవారి దర్శనం ఏర్పాట్లను చేసింది. అందులో భాగంగా, రాంబగీఛ గెస్ట్ హౌస్ నుంచి శ్రీవారి ఆలయానికి వారిని తీసుకెల్లేందుకు బ్యాటరీ వాహనాలను, శ్రీవారి ఆలయానికి బయోమెట్రిక్ ద్వారా అనుమతించేందుకు టీటీడీ ఏర్పాట్లను చేసింది.
టీటీడీ చేపట్టిన ప్రత్యేక ఏర్పాట్లను వారు సున్నితంగా తిరస్కరించి, సామాన్య భక్తుల తరహాలోనే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి చేరుకురుకుంటానని వారే స్వయంగా వెల్లడించి శ్రీవారిని దర్శించుకున్నారు. జనవరి 8వ తేదీన తిరుపతిలో జరిగిన తోపులాట ఘటన నేపథ్యంలో శ్రీ చాగంటి వారి ప్రవచన కార్యక్రమాన్ని వాయిదా వేస్తే బాగుంటుందని వారి దృష్టికి టీటీడీ ఉన్నతాధికారులు తీసుకెళ్లగా, ఈ విన్నపాన్ని చాగంటి వారు అంగీకరించారు. తదుపరి వారి అనుమతి తేదీలను మరోసారి తీసుకుని ప్రవచనాలు ఇచ్చేందుకు టీటీడీ నిర్ణయించింది. వాస్తవం ఇలా ఉండగా బయోమెట్రిక్ ద్వారా కాకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి శ్రీవారి ఆలయంలోకి అనుమతించారని, చివరి నిమిషంలో పరిపాలనా కారణాల రీత్యా శ్రీ చాగంటి వారి ప్రవచనాల కార్యక్రమాన్ని టీటీడీ రద్దు చేసినట్లు అవాస్తవ సమాచారాన్ని ప్రచారం చేశారని టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది.