
తమిళనాడులోని శ్రీరంగంలోని ప్రముఖ శ్రీ వైష్ణవ క్షేత్రం శ్రీ రంగనాథ స్వామికి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్రీ జె శ్యామలరావు బుధవారం పట్టువస్త్రాలను సమర్పించారు. దేశ వ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన పుణ్యక్షేత్రాలకు పట్టువస్త్రాలను 2008 ఏడాది నుంచి టీటీడీ సమర్పిస్తోంది. అందులో భాగంగా ఈ ఏడాది కూడా శ్రీరంగం ఆలయానికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అంతకుముందు ఆలయ ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్న టిటిడి ఈవోకు శ్రీ రంగం ఆలయ జాయింట్ కమిషనర్ శ్రీ మరియప్పన్ స్వాగతం పలికారు.
అనంతరం టీటీడీ ఈవో పీఠాధిపతికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రధాన ఆలయ సముదాయంలో ఉన్న మూల విరాట్ ఇతర ఉప ఆలయాలను దర్శనం చేసుకున్నారు. సాధారణంగా శ్రీరంగం ఆలయ అధికారులు ప్రతి సంవత్సరం ఆణివార ఆస్థానం రోజున తిరుమల ఆలయానికి వస్త్రాలను సమర్పిస్తారు, అయితే ఈ పవిత్ర కార్తీక మాసం ఏకాదశి రోజున శ్రీ రంగం ఆలయానికి టిటిడి పట్టు వస్త్రాలను అందజేస్తుంది. ఈ కార్యక్రమంలో టీటీడీ తిరుమల ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాధం, ఇతర టీటీడీ సిబ్బంది పాల్గొన్నారు.
