
తిరుమలలో ఎస్వీ మ్యూజియంను అభివృద్ధి చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అడుగు ముందుకేసింది. ఈ క్రమంలోనే ఎస్వీ మ్యూజియం ఆధునీకరణ పనులను టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు బోర్డు సభ్యురాలు శ్రీమతి పనబాక లక్ష్మితో కూడి శుక్రవారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా టీసీఎస్ సంస్థ సీఎస్ఆర్ కింద రూపొందిస్తున్న గ్యాలరీలను ఆయన పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
తిరుమల క్షేత్ర చరిత్ర, వైభవం, పురాణాల విశిష్టత ప్రతిబింబించేలా, భక్తులకు ఆధ్యాత్మిక జ్ఞానం అందించేలా మ్యూజియాన్ని అభివృద్ధి చేసి పూర్తి స్థాయిలో భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని చైర్మన్ ఆదేశించారు. ఎస్వీ మ్యూజియంలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించేలా మ్యూజియంను అభివృద్ధి చేయనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో ఆరోగ్య శాఖ మరియు ఇంచార్జ్ చీఫ్ మ్యూజియం ఆఫీసర్ శ్రీ సోమన్నారాయణ, హెల్త్ ఆఫీసర్ శ్రీ మధుసూదన్, ఏవిఎస్వో శ్రీ విశ్వనాధ్, మ్యూజియం క్యూరేటర్ శ్రీ శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
