వైశాఖ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అని అంటారు. మోహిని ఏకాదశి మహత్యాన్ని సూర్య పురాణంలో వివరించబడింది. ఒకసారి పాండవ అగ్రజుడు ధర్మరాజు శ్రీకృష్ణుడిని చూసి ఇలా ప్రశ్నించాడు. “ఓ జనార్ధనా ! వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి ? దాన్ని ఆచరించే పధ్ధతి ఏమిటి ? దానిని ఆచరించడం వలన కలిగే ఫలితాలు ఏమిటి ?” దానికి శ్రీకృష్ణుడు , ధర్మరాజుతో ఇలా అన్నాడు “ఓ ధర్మనందనా ! వశిష్ఠుడు శ్రీరాముడిని తెలిపిన ఒక కథను నేను నీకు వివరిస్తాను. సావధానంగా విను” అని చెప్పాడు.
ఒకసారి శ్రీరాముడు జనక పుత్రిక అయిన సీతాదేవి వియోగంతో అత్యంత వేదనకు గురయ్యి సమత పాపదుఃఖ వినాశకరమైన ఒక వ్రతాన్ని గురించి తనకు వివరించమని వశిష్టుడిని అడిగాడు.వశిష్ఠుడు ఏమన్నాడంటే.. “రామచంద్రా ! నీ ప్రశ్న సకల మానవాళికి లాభదాయకమైనది. కేవలం నీ మంగళకర నామం ఉచ్చరించినందుకే మానవులు పునీతులై , పవిత్రులై సమస్త శుభాన్ని పొందగలుగుతారు. అయినా సాధారణ మానవుల లాభం కోసం నేను ఒక మహావ్రతాన్ని వివరిస్తాను. శ్రీరామా ! వైశాఖ శుక్లపక్ష ఏకాదశి మోహిని ఏకాదశిగా ప్రసిద్ధి చెందినది. అది ఏంతో మంగళకరమైనది. ఆ ఏకాదశిని పాటించడం ద్వారా మనిషి యొక్క సమస్త పాపాలు , దుఃఖాలు , మాయ పటాపంచలు అవుతాయి’’ అని చెప్పి దానికి సంబంధించిన పరమ మంగళకరమైన కథను సైతం వశిష్టుడు వివరించాడు.