తిరుమల కొండలపై మరోసారి దివ్య వైభవం ఉట్టిపడబోతోంది. శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఫిబ్రవరి 26 నుంచి మార్చి 2 వరకు ఘనంగా జరగనున్నాయి. ఈ రోజుల్లో రాత్రి వేళ పుష్కరిణిలో స్వామి, అమ్మవారు తెప్పలపై విహరిస్తూ భక్తులకు అద్భుత దర్శనం ఇస్తారు. తొలి రోజు శ్రీరామచంద్రమూర్తి సీతా లక్ష్మణ సమేతంగా దర్శనమిస్తే, రెండో రోజు రుక్మిణీ సమేత మురళీకృష్ణుడు భక్తుల హృదయమనోహరంగా దర్శనమిస్తారు. మూడో రోజు నుంచి చివరి రోజు వరకు శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామివారి తెప్ప విహారం మరింత వైభవంగా సాగుతుంది. ఈ ఉత్సవాల కారణంగా కొన్ని సేవలను తాత్కాలికంగా రద్దు చేశారు. ఫిబ్రవరి 26, 27 తేదీల్లో సహస్రదీపాలంకార సేవ, ఫిబ్రవరి 28న, మార్చి 01, 02వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. సేవలు రద్దయినా, తెప్పోత్సవ దర్శనం స్వయంగా ఒక మహా పుణ్యఫలం. పుష్కరిణిలో ప్రతిబింబించే శ్రీవారి రూపం భక్తుల మనసుల్లో భక్తి, ఆనందం, శాంతిని నింపుతుందని విశ్వాసం.

