తుంబురు తీర్థ ముక్కోటిలో 24 వేల మందికి పైగా పాల్గొన్న భక్తులు

తిరుమలలోని శేషాచల అడవుల్లో ప్రముఖ తీర్థంగా భాసిల్లుతున్న తుంబురు తీర్థముక్కోటిలో 24 వేల‌ మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. మార్చి 24న మొత్తం 15,750 మంది, మార్చి 25న 8,250 మంది భక్తులు ఫాల్గుణ పౌర్ణమి పర్వదినాన తీర్థ స్నానం ఆచరించారు.

టీటీడీ ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి ఆదేశాల మేరకు తుంబురు తీర్థానికి వెళ్ళే భక్తుల సౌకర్యార్థం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా మార్చి 24వ తేదీ ఉదయం 5 గంట‌ల నుండి నిరంత‌రాయంగా ఉద‌యం, సాయంత్రం పొంగలి, ఉప్మా, పాలు, మజ్జిగ అందించారు. అదేవిధంగా మధ్యాహ్నం, రాత్రి సాంబరు అన్నం, పెరుగన్నం, టమోటఅన్నం, పులిహోరాను భక్తులకు శ్రీవారి సేవకులు పంపిణీ చేశారు.

ఇంజినీంగ్‌ విభాగం ఆధ్వర్యంలో భక్తులు భోజనం చేసేందుకు వీలుగా అవసరమైన షెడ్లు, మార్గo మధ్యలో నిచ్చెనలు, త్రాగునీటి కొళాయిలు ఏర్పాటు చేశారు. దీర్ఘకాలిక వ్యాధులు, ఆస్తమా, స్థూల కాయం, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారిని తీర్థానికి అనుమతించలేదు. పాప వినాశనం వద్ద పార్కింగ్ సమస్య కారణంగా భక్తులను ఆర్టీసీ బస్సులలో మాత్రమే అనుమతించారు. తుంబురు తీర్థానికి అటవీ మార్గంలో వెళ్ళే సమయంలో భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రేడియో మరియు బ్రాడ్‌కాస్టింగ్‌ విభాగం ఆధ్వర్యంలో తరచూ ప్రకటనలు చేశారు.

ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో తుంబురు తీర్థం, పాపావినాశనం వద్ద పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తూ అదనపు సిబ్బందిని నియమించారు. అత్యవసర పరిస్థితుల్లో భక్తులకు సేవలందించేందుకు అంబులెన్స్‌లను, పారామెడికల్‌ సిబ్బందిని అవసరమైన మందులు అందుబాటులో ఉంచారు. మరోవైపు టిటిడి భద్రతా విభాగం, పోలీసులు, అటవీశాఖ సిబ్బంది కలసి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. టీటీడీ కల్పించిన అన్నప్రసాదాలు, తాగునీరు, ఇతర ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.

Share this post with your friends