శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు నిన్న అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. నారాయణగిరి ఉద్యానవనాల్లో వివిధ సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పాలను తీసుకొచ్చి భూలోక వైకుంఠాన్ని తలపించే రీతిలో దశావతార – అష్టలక్ష్మి మండపాన్ని అలంకరించి దానిలో శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవాలను టీటీడీ ప్రారంభించింది. ఈ పరిణయోత్సవాల్లో భాగంగా మొదటిరోజు అంటే వైశాఖశుద్ధ నవమిరోజైన మంగళవారంనాడు శ్రీ మలయప్ప స్వామివారు గజవాహనాన్ని అధిరోహించగా ఉభయనాంచారులు పల్లకిపై పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేశారు.
వివిధ హంగులతో శోభిల్లుతున్న ఈ పెండ్లిమండపంలో నిత్య నూతన వధూవరులైన శ్రీ స్వామివారికి, అమ్మవార్లకు ఎదుర్కోలు, మాల పరివర్తనం, పూలబంతులాట, నూతన వస్త్ర సమర్పణ కోలాహలంగా జరిగాయి. ఆ తరువాత శ్రీ స్వామివారికి కొలువు (ఆస్థానం) జరిగింది. ఈ క్రతువుల అనంతరం చతుర్వేద పారాయణం, మలహారి, దేశిక, సౌరాష్ట్ర, వారహి, కదన కుతూహల, నీలంబారి వంటి వివిధ రాగ- తాళ-వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. అనంతరం ఆర్జిత భక్తులకు వస్త్ర బహుమానం, ప్రసాద వితరణ జరిగింది. ఆ తరువాత శ్రీదేవి భూదేవి సహితుడైన స్వామి అశేష భక్తజనం మధ్య ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేయడంతో తొలిరోజు వివాహ వేడుక ఘనంగా ముగిసింది.