సప్తవర్ణ శోభితం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పుష్పయాగం

శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మంగళవారం పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం 7 నుండి 10 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వ‌హించారు. ఉదయం 10 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంల‌తో అభిషేకం చేశారు. మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు పుష్పయాగం కన్నులపండుగగా నిర్వహించారు.

12 రకాల పుష్పాలు, 6 రకాల ఆకులతో స్వామివారికి పుష్పయాగాన్ని నిర్వహించారు. చామంతి, రోజాలు, గన్నేరు, సంపంగి, మల్లెలు, రుక్షి, కనకాంబరాలు, తామర, కలువ, మొగలిరేకులు, మాను సంపంగి పుష్పాలు, తులసి, దవనం, మరవం, బిల్వం, పన్నీరాకు వంటి ఆకులను ఉపయోగించారు. పుష్పయాగానికి 4 టన్నుల పుష్పాలను దాతలు విరాళంగా అందించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నుంచి పుష్పాలు విరాళంగా అందాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీమతి సుచిత్ర ఎల్ల, ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, గార్డెన్ సూప‌రింటెండెంట్ శ్రీ శ్రీ‌నివాసులు, గార్డెన్ మేనేజర్ శ్రీ జనార్దన్ రెడ్డి, ఏఈవో శ్రీ గోపినాథ్‌, సూపరింటెండెంట్లు శ్రీ ర‌మేష్‌, శ్రీ రాజ్‌కుమార్‌, ఆల‌య అర్చ‌కులు శ్రీ బాలాజి రంగాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధ‌న‌శేఖ‌ర్‌, ఇత‌ర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

Share this post with your friends