వైభవంగా శ్రీ గోవిందరాజ స్వామివారి కవచ ప్రతిష్ట‌, కపిలేశ్వరాలయంలో పవిత్రోత్సవాలు..

తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో జరుగుతున్న జ్యేష్ఠాభిషేకంలో రెండో రోజు సోమవారం కవచప్రతిష్ట‌ వైభవంగా జరిగింది. నిన్న ఆలయంలో ఉద‌యం 08.00 – 10.00 గం.ల వరకు శ‌త‌క‌ల‌శ‌స్న‌ప‌నం, మ‌హాశాంతి హోమం చేప‌ట్టారు. అనంతరం ఉదయం 10.00 గం.ల నుండి 11.30 గం.ల వరకు ఆలయంలోని కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజ స్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం, సమర్పణ, ఆరగింపు, అనుగ్రహం, బ్రహ్మోఘోషలను వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్ల‌తో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి కవచప్రతిష్ట‌ చేశారు. సాయంత్రం 5.30 గం.ల నుండి 6.30 గం.ల వరకు ఉభయ నాంచారులతో శ్రీవారు శ్రీవారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాఢ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు.

శ్రీ కపిలేశ్వరాలయంలో పవిత్రోత్సవాలు

తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలలో భాగంగా నిన్న ఉదయం నుండి శాస్రోక్తంగా కైంకర్యాలు నిర్వహించారు. ఉదయం సుప్రభాతం, అభిషేకం, అలంకారం, అర్చన, నివేదన చేపట్టారు. ఉదయం 09.00 – 10.00 గం.ల వరకు పంచమూర్తుల ఉచ్చవర్లకు స్నపన తిరుమంజనం, అలంకారం నిర్వహించారు. సాయంత్రం కలశ స్థాపనం, కలశ పూజ, అగ్ని కార్యం, హోమం, లఘు పూర్ణాహూతి, గ్రంధి పవిత్ర ప్రతిష్ట నిర్వ‌హిస్తారు. జూలై 08న ఉద‌యం గ్రంథి ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ‌, ‌సాయంత్రం యాగ‌శాల‌ పూజ‌, హోమం చేప‌డ‌తారు. జూలై 09న ఉద‌యం మ‌హాపూర్ణాహుతి, క‌ల‌శోధ్వాస‌న‌, ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ నిర్వ‌హిస్తారు. ‌సాయంత్రం 6 గంట‌ల‌కు పంచమూర్తులైన శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వరస్వామి, శ్రీ సుబ్రమణ్యస్వామి, శ్రీ చండికేశ్వర స్వామివార్లు పుర వీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

Share this post with your friends