
చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం సాయంత్రం 3.30 గంటలకు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ద్వారాలను టీటీడీ మూసివేసింది.
సాంప్రదాయబద్ధంగా రాత్రి 9.50 గంటల నుంచి సోమవారం తెల్లవారుజామున 1.31 గంటల వరకు చంద్రగ్రహణం కొనసాగింది. సోమవారం ఉదయం శాస్త్రోక్తంగా శుద్ధి తదితర కార్యక్రమాలు పూర్తి చేసిన ఉదయం 3 గంటలకు మళ్లీ శ్రీవారి ఆలయ ద్వారాలు తెరిచి భక్తులను దర్శనానికి అనుమతించారు.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులందరికీ నిర్దేశిత సమయానికి అనుగుణంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం ఏర్పాట్లు దర్శనం కల్పించడం జరిగింది అని తెలిపారు. చంద్రగ్రహణం కారణంగా అన్నప్రసాదం కాంప్లెక్స్, వకుళమాత, పిఏసి–2, వైకుంఠం వంటశాలలను సైతం మూసి వేశారు. దీనిని దృష్టిలో ఉంచుకుని అన్నప్రసాద విభాగం 50 వేల పులిహోర ప్యాకెట్లు సిద్ధం చేసి భక్తులకు అందజేసింది. అన్నప్రసాద వితరణ సోమవారం ఉదయం 8 గంటల నుంచే తిరిగి ప్రారంభమైంది.
చంద్రగ్రహణం కారణంగా ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ స్థానికాలయాలైన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయం, నారాయణ వనం, కార్వేటినగరం , ఒంటిమిట్ట, అమరావతి శ్రీ ఎస్వీ ఆలయం తదితర టీటీడీ ఆలయాల తలుపులు మూసివేశారు. అనంతరం నేటి తెల్లవారుజామున తిరిగి ఆలయ ద్వారాలను తెరిచారు.
