
తిరుపతి జిల్లా తలకోనలోని శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయంలో మొదటి దశ పునర్మిణాన పనులకు ఆగష్టు 18వ తేదీ సోమవారం ఉదయం శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా ఆలయాల నిర్మాణం, పునర్మిణాం పనులను వేగవంతం చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మెన్ బీఆర్ నాయుడు తెలిపారు. మొదటి దశగా శ్రీ సిద్దేశ్వర స్వామి వారి గర్భాలయం, అర్ధమండపం, శ్రీ పార్వతీదేవి అమ్మవారి గర్భాలయం, మహా మండపం పనులను పునర్మించేందుకు చర్యలు చేపట్టినట్లు టీటీడీ ఛైర్మెన్ వెల్లడించారు.
ఈ పనుల కోసం మొదటి దశగా ఇప్పటికే రూ. 2 కోట్లు టీటీడీ విడుదల చేయగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందన్నారు. ఈ నిధులతో పాటు సదరు పనులకు, ఇతర అభివృద్ధి పనులకు దశల వారీగా మరిన్ని నిధుల సహకారం అందిస్తామన్నారు. వీటితోపాటు ముఖ మండపం, నంది మండపం, రాజ గోపురం, శ్రీ సుబ్రమణ్యస్వామి ఆలయం, శ్రీ వినాయక స్వామి ఆలయం, నవగ్రహ మండపం, శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయం, ధ్వజమండపం, ఆఫీస్ గదులు, స్టోర్ గదులు, పోటు, కళ్యాణకట్ట, పుష్కరిణి తదితర పనులను చేపట్టనున్నారు. అంతకుముందు భూమి పూజకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
