ధ్వజారోహణంతో వైభవంగా శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

తరిగొండ శ్రీ లక్ష్మీ న‌ర‌సింహ‌స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం 8 నుండి 8.30 గంటల మధ్య మీన‌ లగ్నంలో పాంచరాత్ర ఆగమొక్తంగా ధ్వజారోహణ ఘట్టంతో బ్రహ్మోత్సవాలు ఆలయ అర్చకులు, వేద పండితులు ప్రారంభించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణ నడుమ ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందుగా విశ్వక్సేనులవారిని ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగించారు. దీనికి ఒక కారణం ఉంది.

అదేంటంటే.. ఈ ఉత్సవం ద్వారా స్వామివారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఒకమారు ముందుగా విశ్వక్సేనులవారు పర్యవేక్షిస్తారు. అనంతరం అర్చకులు విష్వక్సేన ఆరాధన, వాస్తుహోమం, గరుడ ప్రతిష్ఠ, రక్షా బంధనం చేపట్టారు. ఇందులో శాస్త్రోక్తంగా గరుత్మంతుణ్ణి కొత్త వస్త్రంపై లిఖించి, పూజలు చేసి, ధ్వజస్తంభంపై ప్రతిష్టించారు. 18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్ష్యం. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపినాథ్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ కృష్ణ‌మూర్తి, శ్రీ నాగ‌రాజు, ఆలయ అర్చకులు శ్రీకృష్ణరాజ బట్టర్, శ్రీ కృష్ణ ప్రసాద్ బట్టర్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Share this post with your friends