అనాథ పిల్లల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఎస్వీ బాలమందిరం..

తిరుమల తిరుపతి దేవస్థానముల (టీటీడీ) ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ వేంకటేశ్వర (ఎస్వీ) బాలమందిరం అనాథ పిల్లల జీవితాల్లో ఆశ, వెలుగులు నింపుతూ ఒక నిజమైన జీవనాడిగా నిలుస్తోంది. విద్య, వసతి, ఆహారం, ఆరోగ్య సంరక్షణతో పాటు సాంస్కృతిక, నైతిక విలువలను అందిస్తూ సమాజంలో ఆదరణకు దూరమైన పిల్లలకు ఒక సురక్షితమైన భవిష్యత్తు దిశను చూపిస్తోంది. 1943లో ఎస్వీ అనాధాశ్రమంగా ప్రారంభమైన ఈ సంస్థ, అనాథ పిల్లలకు కేవలం ఆశ్రయం మాత్రమే కాకుండా సంపూర్ణ జీవన వికాసాన్ని అందించాలనే లక్ష్యంతో 1961లో అప్పటి ప్రధానమంత్రి చాచా జవహర్‌లాల్ నెహ్రూ చేతుల మీదుగా ఎస్వీ బాలమందిరంగా నామకరణం చేశారు. 2014లో ఈ ఎస్వీ బాలమందిరాన్ని శ్రీ ఎస్వీ సర్వశ్రేయాస్ ట్రస్ట్ పరిధిలోకి టిటిడి తీసుకొచ్చింది.

ప్రారంభంలో పరిమిత సంఖ్యలో పిల్లలతో ప్రారంభం

2003 నాటికి సంవత్సరానికి 300 మంది, 2005లో 500మంది విద్యను అభ్యసించేలా సీట్ల సంఖ్యను పెంచారు. 2025–26 విద్యా సంవత్సరంలో ఎస్వీ బాలమందిరంలో 100 మంది బాలికలు, 143 మంది బాలురు, పదో తరగతి అనంతరం టిటిడి, ఇతర ప్రైవేట్ కళాశాలలో బాలురు 56, బాలికలు 49 టిటిడి సంరక్షణలో విద్యను అభ్యసిస్తున్నారు. ఉచిత విద్య, ఉచిత భోజనం, ఉచిత వసతి, ఉచిత వైద్యం, పూర్తి భద్రతతో పాటు ఉన్నత విద్యకు ఆర్థిక సహకారం అందిస్తూ ఎందరో అనాథ పిల్లల భవిష్యత్తుకు ఎస్వీ బాలమందిరం బలమైన పునాదిగా నిలుస్తోంది.

Share this post with your friends