
ఇక మీదట శ్రీనివాస కల్యాణోత్సవాలను ప్రపంచ వ్యాప్తంగా మరింత పటిష్టాత్మకంగా నిర్వహించేందుకు విధి, విధానాలు రూపొందించాలని టీటీడీ భావిస్తోంది. కలియుగ దైవం శ్రీనివాసుడి వైభవాన్ని మరింత విశ్వ వ్యాప్తం చేసేందుకు శ్రీనివాస కల్యాణోత్సవాలను చేపడుతున్నారు. టీటీడీ ప్రతిష్ట మరింత పెంచేలా కల్యాణోత్సవాల నిర్వహణకు నివేదిక రూపొందించాలని కల్యాణోత్సవం ప్రాజెక్ట్ అధికారులను ఈవో ఆదేశించారు. ముందుగా టీటీడీ శ్రీ వేంకటేశ్వర స్వామివారి కల్యాణోత్సవాలను వ్యాపార దృక్పథంతో కాకుండా భక్తి భావంతో నిర్వహించే సంస్థలు, నిర్వహణ వ్యక్తుల ఎంపిక చేయనుంది.
అలాగే ఏ ప్రాంతంలో కల్యాణోత్సవం నిర్వహిస్తున్నారు, ఆర్థిక, న్యాయపరమైన తదితర అంశాలపై ముందుగా ఎంవోయూ చేసుకునేలా పటిష్ట నియమాళిని రూపొందించనున్నారు. ఇప్పటికే ఏపీఎన్ఆర్టీ ఆధ్వర్యంలో కల్యాణోత్సవాలను విదేశాల్లో నిర్వహిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ప్రణాళికా బద్ధంగా శ్రీనివాస కల్యాణాల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. విదేశాల్లో కల్యాణోత్సవాల నిర్వహణలో చేయవలసిన పనులు, చేయరాని పనుల జాబితాను రూపొందించి, అందుకు అనుగుణంగా పటిష్టంగా నిర్వహణకు నిబంధనలు తయారు చేయాలని అధికారులకు టీటీడీ సూచించింది.
