చిత్తూరు జిల్లా కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా అత్యంత వైభవంగా ప్రతిరోజూ రోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామివారి వాహన సేవల్లో పాల్గొంటున్నారు. ఈ బ్రహ్మోత్సవాలు సోమవారం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. సోమవారం సాయంత్రం పెద్ద శేష వాహనంపై ఊరేగిన కోనేటి రాయుడు.. మంగళవారం చిన్న శేష వాహనంపై ఊరేగారు.
ఉత్సవాల్లో భాగంగా శ్రీ కోనేటి రాయుడి కల్యాణోత్సవాన్నిసైతం నిర్వహించనున్నారు. మే 9వ తేదీ సాయంత్రం 4 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం జరుగనుంది. రూ.500/- చెల్లించి ఇద్దరు కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. ఉత్తరీయం, రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. మే 14వ తేదీ సాయంత్రం 4 గంటలకు పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.