పవిత్రమైన ధనుర్మాసం ముగింపు సందర్భంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సోమవారం ఉదయం శ్రీ గోదా కల్యాణం వైభవంగా జరిగింది. ధనుర్మాసంలో టిటిడి ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా గల 250 కేంద్రాల్లో నెల రోజుల పాటు ప్రముఖ పండితులతో తిరుప్పావై ప్రవచనాలు నిర్వహించారు. ముందుగా శ్రీ గోదాదేవి(ఆండాళ్), శ్రీరంగనాథస్వామివారి ఉత్సవర్లను వేదికపై కొలువుతీర్చారు. అనంతరం శాస్త్రోక్తంగా కల్యాణ ఘట్టం నిర్వహించారు. వేద పారాయణదారుల వేద పఠనం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గాత్రసంగీతం నడుమ స్వామి, అమ్మవార్ల కల్యాణం వైభవంగా జరిగింది.
అన్నమాచార్య కళామందిరంలో ముగిసిన తిరుప్పావై ప్రవచనాలు
తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో డిసెంబరు 16 నుంచి దాదాపు నెల రోజుల పాటు జరిగిన తిరుప్పావై ప్రవచనాలు సోమవారం ముగిశాయి. తిరుపతికి చెందిన ప్రముఖ పండితులు శ్రీ చక్రవర్తి రంగనాథన్ ఇక్కడ తిరుప్పావై ప్రవచనాలు వినిపించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఎఫ్ఏసిఏఓ శ్రీ బాలాజి, ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ శ్రీ పురుషోత్తం, ప్రోగ్రాం అసిస్టెంట్ శ్రీమతి కోకిల, స్థానిక భక్తులు పాల్గొన్నారు.