ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల విడుదల వాయిదా

తిరుమలలో శ్రీ మలయప్ప స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే పరిపాలనా కారణాల వల్ల డిసెంబర్ 29, 30, 31 (వైకుంఠ ద్వార దర్శనం) తేదీలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం. శ్రీవాణి బ్రేక్ దర్శనాలకు సంబంధించిన టిక్కెట్లు పరిపాలనా కారణాల వలన విడుదల చేయబడవు. ఈ టిక్కెట్ల విడుదలకు సంబంధించిన సవరించిన షెడ్యూల్‌ను త్వరలో తిరుమల తిరుపతి దేవస్థానం విడిగా ప్రకటిస్తుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ తెలిపింది.

వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో విధులు నిర్వర్తించడానికి వచ్చిన డిప్యూటేషన్ అధికారులు, సిబ్బంది మరింత భక్తి, నిబద్ధతతో పనిచేయాలని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం తిరుమల ఆస్థాన మండపంలో డిప్యూటేషన్ సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంబంధిత ప్రాంతాల్లో ఇప్పటికే విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందితో సమన్వయం చేసుకుని, అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని కోరారు. ఈసారి బ్రహ్మోత్సవాలను ఎంతో సమగ్రంగా ప్రణాళికాబద్ధంగా రూపొందించామని, నిర్ధిష్ట విధివిధానాలతో పాటు చెక్‌లిస్ట్‌లను కూడా సిద్ధం చేశామని, తద్వారా భక్తుల నుండి సరైన ఫీడ్‌బ్యాక్ పొందేందుకు వీలుకలుగుతుందని తెలియజేశారు.

Share this post with your friends