న‌వ‌నీత‌ కృష్ణాలంకారంలో రామ‌య్య ముగ్ధ‌మ‌నోహ‌ర రూపం

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే భక్తులకు ఎలాంటి ఇబ్బందీ కలుగకుండా అన్ని ఏర్పాట్లూ చేశారు. అడుగడుగునా చలువ పందిళ్లు వేశారు. భక్తులకు మంచినీటి సౌకర్యం కల్పించారు. ఇక నిత్యం స్వామివారికి వాహన సేవలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా నాలుగో రోజు బుధవారం ఉదయం న‌వ‌నీత‌ కృష్ణాలంకారంలో రాముల‌వారు ముగ్ధ‌మ‌నోహ‌రంగా ద‌ర్శ‌న‌మిచ్చారు. ఉదయం 7.30 గంటల నుండి స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది.

కేరళ డ్రమ్స్, భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. పురాణాల ప్రకారం.. కృష్ణుడు వెన్న‌దొంగ‌. రేప‌ల్లెలో బాల‌కృష్ణుడు య‌శోద‌మ్మ ఇంట్లోనే గాక అంద‌రి ఇళ్ల‌లోకి వెళ్లి వెన్న ఆర‌గించేవారు. ఈ చిన్నికృష్ణుడి లీల‌ల‌ను గుర్తు చేస్తూ రాముల‌వారు వెన్న‌కుండ‌తో భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ నటేష్ బాబు, సూపరింటెండెంట్‌ శ్రీ హ‌నుమంత‌య్య‌, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ న‌వీన్‌, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Share this post with your friends