శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులందరికీ టీటీడీ ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వామి వారి దయ, ఆశీస్సులతో ప్రపంచంలోని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 21వ తేదీన తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసిన సందర్భంగా పలు ప్రధాన అంశాలపై స్పష్టత ఇచ్చారని వెల్లడించారు. ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు వాటిపై టిటిడి బోర్డు పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు..
గత ప్రభుత్వ హయాంలో ముంతాజ్ హోటల్స్కు ఇచ్చిన భూ కేటాయింపులను రద్దు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.
భవిష్యత్తులో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరిధిలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఏడు కొండలకు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు చేపట్టకుండా నిర్ధిష్టమైన కార్యాచరణ అమలు చేస్తున్నాము.
ఇప్పటికే ఏడు కొండల ఆనుకుని వున్న భూముల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రభుత్వ విభాగాలకు చెందిన భూములను టీటీడీ స్వాధీనం చేసుకుని, వాటికి ప్రత్యామ్నాయంగా చూపడానికి, ఈ అంశంపై తదుపరి చర్యల కొరకు ప్రభుత్వానికి నివేధిస్తాం.
మున్ముందు శ్రీ మలయప్ప స్వామివారి ఏడు కొండలకు ఆనుకుని వున్న భూములలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మాత్రమే జరిగేలా ధార్మిక చట్టాల్లో సవరణలు తీసుకొస్తాము.
శ్రీవారికి దేశ వ్యాప్తంగా ఉన్న ఆస్తులను పరిరక్షించడం, వాటిని సద్వినియోగపరచడం ప్రధాన లక్ష్యంగా విస్తృత చర్యలు చేపడుతున్నాము.
న్యాయస్థానాల్లో వివాదాల్లో ఉన్న స్వామివారి ఆస్తుల వివాదాలను వేగంగా విచారణ ప్రక్రియ పూర్తి అయ్యి సద్వినియోగంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేయడం జరుగుతుంది.
శ్రీవారి పవిత్ర భూమిలో ఒక్క అంగుళం కూడా అనధికార ఆక్రమణలు ఉండకుండా చర్యలు తీసుకుంటాం.
టీటీడీలో విధులు నిర్వహించే ఉద్యోగులు అందరూ హిందూ ధర్మానుసారం మాత్రమే ఉండేలా చర్యలు చేపడుతున్నాం. ప్రస్తుతం విధుల్లో ఉన్న ఇతర మతస్థులను వారి హోదాకు తగినట్లుగా, వారి మనోభావాలకు భంగం కలగకుండా వివిధ ప్రత్యామ్నాయ పద్దతుల ద్వారా వారిని బదిలీ లేదా విఆర్ఎస్ ఇచ్చేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుంది.
దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో టీటీడీ ఆలయాలు నిర్మించేందుకు ధృడ సంకల్పంతో కార్యాచరణ అమలు చేస్తున్నాం.
ఇందుకోసం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆయా రాజధానుల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం కోసం భూమి కేటాయించాలని కోరుతూ లేఖలు రాశాం.
భూమి కేటాయింపులు అనుసరించి వేగంగా అన్ని రాష్ట్రాల రాజధానులలో శ్రీవారి ఆలయాల నిర్మాణాన్ని మొదలు పెడతాము.
రాష్ట్రంలోని చిన్న చిన్న పట్టణాలు, గ్రామాలు, దళిత వాడల్లో ఆర్ధిక స్థోమత లేక నిర్మాణంలో ఆగిపోయిన దేవాలయాలను, శిధిలావస్థకు చేరిన దేవాలయాలను పునరుద్ధరించాలని నిర్ణయించాము.
కొత్త దేవాలయాల నిర్మాణ ప్రతిపాదనలకు కూడా ఆర్థిక సహకారం అందిస్తాం. ఈ కార్యక్రమాల కోసం శ్రీవాణి ట్రస్టు నుంచి ఆర్థిక సాయం అందించి, రాష్ట్రంలో దేవాలయాల పునరుద్ధరణ మరియు నిర్మాణ కార్యక్రమాలను వేగంగా పూర్తి చేయిస్తాము.
ఈ ప్రక్రియకు టీటీడీ అధిక ప్రాధాన్యత ఇస్తూ.. నిరంతరాయంగా, ఎక్కడా రాజీపడకుండా దేవాలయాల అభివృద్ధి కార్యక్రమాల ద్వారా రాష్ట్రం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లేలా చర్యలు చేపట్టడం జరుగుతుంది.
ఇటీవల అమరావతిలో శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో శ్రీవారి కళ్యాణాలు వైభవంగా నిర్వహించేందుకు చర్యలు చేపడతాం.
ఈ సందర్భంగా రాష్ట్రముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి టీటీడీ ధర్మకర్తల మండలి ధన్యవాదాలు తెలియజేస్తున్నది.