కర్ణాటకలోని ఉడిపిలో ప్రఖ్యాతిగాంచిన శ్రీకృష్ణుడి ఆలయం ఉంది. తాజాగా ఈ ఆలయం దగ్గర కొన్ని కార్యకలాపాలపై కృష్ణ మఠం నిషేధం విధించింది. ఏదైనా వివాహానికి ముందు కానీ తరువాత కానీ ఫోటోషూట్లకు ఇకపై అనుమతి లేదు. ఈ క్రమంలోనే మఠం ఉత్తర్వులు సైతం జారీ చేసింది. ఉదయం సమయంలో స్వామీజీ సంచారం చేస్తుంటారు. ఆ సమయంలో ఈ ఫోటోషూట్ల కారణంగా ఇబ్బంది తలెత్తుతుండటంతో మఠం ఇలాంటి ఆదేశాలు ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తకుండా ఉండటానికి మఠం ఈ చర్య తీసుకుంది.
ఉడిపిలో కృష్ణ మఠంలోని రథ్ స్ట్రీట్ కాంప్లెక్స్ అనేది రకరకాల భవనాలతో చాలా అందంగా ఉంటుంది. ముఖ్యంగా బెలంబాలాగే ఆశ్రమ ప్రాంగణంలో వివాహానికి ముందు, తరువాత ఫోటోషూట్ల పేరుతో అసభ్యకరంగా కొన్ని జంటలు ప్రవర్తిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే కేరళ, బెంగళూరు నుంచి పెద్ద ఎత్తున ఫోటోగ్రాఫర్లు ఈ ప్రదేశానికి వస్తున్నారు. ఇది ప్రి వెడ్డింగ్ షూట్, పోస్ట్ వెడ్డింగ్ షూట్లతో పాటు రకరకాల ఫోటో షూట్లకు వేదికగా మారింది. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆశ్రమ అధికారులు వెల్లడించారు. ఇదొక పవిత్ర మార్గమని.. వందల ఏళ్లుగా యతులు, దాసులు నడిచిన రోడ్డని పేర్కొంది.