నవతరానికి మరింతగా అన్నమాచార్యుల కీర్తనలు అందించాలి: టీటీడీ ఈవో

నవతరానికి అనువుగా ఉండేలా, జనబాహుళ్యంలోకి మరింతగా తాళ్ళపాక అన్నమాచార్యులు కీర్తలను తీసుకెళ్లేలా చర్యలు చేపట్టాలని ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి డా.ఆకెళ్ల విభీషణ శర్మను ఈవో ఆదేశించారు. ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్ట్ ఆద్వర్యంలో టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు బెంగళూరు , చెన్నైకి చెందిన గాయకులు, సంగీత దర్శకులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, తాళ్ళపాక అన్నమాచార్యులు వారి 32,000 కీర్తనలలో ఇప్పటి వరకు 14,932 కీర్తనలను టీటీడీ అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. ఇందులో 4,750 కీర్తనలను ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్ట్ రికార్డ్ చేసి 4,610 కీర్తలను టీటీడీ వెబ్ సైట్లో పొందుపరిచారన్నారు.

మిగిలిన 140 కీర్తనలను త్వరలో వెబ్ సైట్ లో పొందుపరుచుతామన్నారు. మొదటి దశలో 290 సంకీర్తనలతో 29 సీడీలను పూర్తి చేయగా, రెండవ దశలో ఇప్పటికే 210 సంకీర్తనలతో 21 సీడీలను రూపొందించారని, మరో 130 సంకీర్తనలతో మిగిలిన 13 సీడీలను త్వరలో భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. మూడవ దశలో 340 సంకీర్తలను సీడీల రూపంలో తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్నమాచార్యుల వారి సంకీర్తలను రాగం నియమాలకు కట్టుబడి లలితంగా, శాస్త్రీయంగా, జనరంజకంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. అన్నమయ్య కీర్తలనలకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారని, పాతతరాన్ని, కొత్త తరాన్ని జోడించి మరింత లయబద్ధంగా కీర్తలను రూపొందించాలని గాయకులను కోరారు. టిటిడి వెబ్ సైట్ లో సులభతరంగా అన్నమయ్య కీర్తలను గుర్తించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మరింత నాణ్యంగా అన్నమయ్య కీర్తలను అందించేలా ఒక కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు.

Share this post with your friends