నిత్యం తిరుమల తిరుపతి దేవస్థానంలోని ఏదో ఒక విభాగానికి విరాళం అందుతూనే ఉంటుంది. దీనిలో భాగంగా తాజాగా తిరుమల శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టుకు పెద్ద మొత్తంలో విరాళం అందింది. బెంగుళూరుకు చెందిన సుయుగ్ వెంచర్స్ ఎల్ఎల్పీ సంస్థ చైర్మన్ శ్రీ యతీష్ సూరినేని ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు ఆదివారం రూ.1.50 కోట్లు విరాళంగా అందించారు. ఈ మేరకు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా దాతను చైర్మన్ అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, పేష్కార్ శ్రీ రామ కృష్ణ పాల్గొన్నారు.
వారాంతపు రోజుల్లో భక్తుల రద్దీ మరింత అధికంగా ఉంటోంది. దీనికి తోడు వేసవి కాలం కూడా కావడం.. పైగా పిల్లలకు పరీక్షలు కూడా అయిపోయి రిజల్ట్స్ రావడంతో పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు వస్తున్నారు. ఈ క్రమంలోనే నిత్యం దాదాపు 80 వేలకు పైగానే భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల రద్దీ పెరిగిపోవడంతో టీటీడీ సైతం గంటల తరబడి భక్తులను కంపార్ట్మెంట్లలోనే ఉంచుతోంది. దీంతో భక్తుల్లో అసహనం పెరిగిపోతోంది. ఒకరినొకరు తోసుకోవడం, పరస్పరం ఘర్షణ పడటం వంటివి జరిగాయి. శ్రీవారి ఆలయ మహాద్వారం వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.