తిరుమల తిరుపతి దేవస్థానంలోని పలు విభాగాలకు నిత్యం పెద్ద మొత్తంలో విరాళం అందుతోంది. హైదరాబాద్ కు చెందిన వారాహి చలన చిత్రం వ్యవస్థాపకుడు, సినీ నిర్మాత శ్రీ సాయి కూరపాటి ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు గురువారం రూ.17 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు తిరుమలలోని అన్నమయ్య భవన్లో తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు. ఈ విరాళాన్ని భక్తులకు మధ్యాహ్నం భోజనం వడ్డించేందుకు ఉపయోగించాలని దాత కోరారు.
తిరుమల పరిధిలోని శేషాచల అటవీ ప్రాంతంలో గురువారం సాయంత్రం పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో అటవీ అధికారులంతా వెంటనే అలర్ట్ అయ్యారు. పాపవినాశనం సమీపంలోని తుంబుర తీర్థం అటవీ ప్రాంతంలో ఈ మంటలు చెలరేగాయి. అవి కాస్తా దావానంలా వ్యాపించి మంటలు తిరుమల వరకూ కనిపించాయి. దీంతో వాటిని అదుపులోకి తెచ్చేందుకు అటవీశాఖ అధికారులు తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. సాయంత్రం చిరుజల్లులు కురవడంతో మంటలు కొంతమేర అదుపులోకి వచ్చాయి. తిరిగి అంతలోనే పెద్దఎత్తున వ్యాపించడంతో అటవీ అధికారులు అప్రమత్తమై మంటలను ఆర్పించేశారు.