
హైదరాబాద్ జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శుక్రవారం పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. యాత్రికుల వల్ల, సిబ్బంది వల్ల తెలియక జరిగే దోషాలవల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, తోమాల, కొలువు నిర్వహించారు. తరువాత మూలవర్లకు అభిషేకం నిర్వహించారు.
యాగశాల వైదిక కార్యక్రమాల అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం 6 గంటలకు యాగశాల వైదిక కార్యక్రమాలు నిర్వహించి పవిత్ర ప్రతిష్ట నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సలహా మండలి అధ్యక్షులు శ్రీ వేంకటేశ్వర రెడ్డి, ఏఈవో శ్రీ రమేష్ , టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నిరంజన్ కుమార్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
