ఒంటిమిట్ట శ్రీకోదండరామ స్వామివారి బ్రహ్మోత్సవాలపై జేఈవో సమీక్ష

కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలను పండుగ వాతావరణం తరహాలో ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామల రావు ఆదేశాల మేరకు టిటిడి జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం అధికారులతో తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలోని జేఈవో ఛాంబర్ లో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. శ్రీ కోదండరామ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 5 – 15వ తేదీ వరకు జరుగనున్న నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేయాలని అధికారులకు జేఈవో సూచించారు. ఒంటిమిట్ట శ్రీకోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలలో ఏప్రిల్ 11వ తేదీన జరుగనున్న శ్రీ సీతారాముల కల్యాణం రాష్ట్ర పండుగ లాంటిదనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేయాలని కోరారు. స్వామివారి ముత్యాల తలంబ్రాలు తయారీ, పంపిణీలో ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.

స్వామివారి కల్యాణానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులకు అన్నప్రసాదాల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని, బ్రహ్మోత్సవాలకు డిప్యూటేషన్ మీద నియమించే అధికారులు, ఉద్యోగులతో పాటు శ్రీవారి సేవకులకు వసతి, ఆహారం ఏర్పాట్లపై ముందస్తుగా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. భక్తులకు ఎండ వేడిమి, అనుకోకుండా వర్షం వస్తే ఉపశమనం కలిగేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఎండ వేడిమికి విరివిగా మజ్జిగ, తాగునీరు పంపిణీ చేసేందుకు అవసరమైన కౌంటర్లు సిద్ధం చేసుకోవాలన్నారు. టీటీడీ విజిలెన్స్ అధికారులు స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని భద్రత, పార్కింగ్ ఏర్పాట్లకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు.

కల్యాణ వేదిక వద్ద భక్తులకు ప్రవేశ మార్గాలు, నిష్క్రమణ మార్గాలు, క్యూలైన్ల ఏర్పాటు, పార్కింగ్, ట్రాఫిక్, ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు, విద్యుత్ అలంకరణలు, అన్నప్రసాదాలు, ముత్యాల తలంబ్రాలు పంపిణీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. స్థానిక పంచాయతీ సిబ్బందిని సమన్వయం చేసుకుని పారిశుధ్యం ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రథమ చికిత్స కేంద్రాలు, అవసరమైన మందులు, అంబులెన్సులు, సిబ్బందిని సిద్ధం చేసుకోవాలని సూచించారు. త్వరలో కడప జిల్లా అధికారులతో సమావేశం నిర్వహిస్తామన్నారు. బ్రహ్మోత్సవాల వాహన సేవల ముందు హిందూ ధర్మ ప్రచార పరిషత్ భజన బృందాలచే ఆకట్టుకునేలా ప్రదర్శనలు ఉండాలని, అలాగే కల్యాణోత్సవం రోజున చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు.

బ్రహ్మోత్సవాలను భక్తులు తిలకించేలా ఎస్వీబీసీ హెచ్డీ క్వాలిటీతో నాణ్యమైన ప్రసారాలు చేయాలని, ప్రముఖమైన రోజులలో ప్రత్యక్ష ప్రసారాలు అందించాలని టీటీడీ ఈవో సూచించారు. భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ సేకరించి సౌకర్యాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. అధికారులు ముందస్తుగా తమ శాఖలలో జరుగుతున్న పనులను సమీక్షించుకుని చెక్ లిస్ట్ ప్రకారం చివరి భక్తుడి వరకు సౌకర్యాలు అందేలా ప్రణాళికలు సిద్దం చేయాలని కోరారు. ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు, కల్యాణ వేదిక వద్ద ప్రోటోకాల్ ప్రకారం చెక్ లిస్ట్ తయారు చేయాలని సూచించారు.

Share this post with your friends