భారత దేశంలో ప్రతి గ్రామంలోనూ శ్రీరామనవమి వచ్చిందంటే శ్రీ సీతారాముల కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. గ్రామంలోని రామాలయాల్లోని కొన్ని ప్రాంతాల్లో చలువ పందిళ్లు వేసి మరీ సీతారాముల కల్యాణాన్ని నిర్వహించారు. అయితే ఏలూరు ఏజెన్సీలో ఆసక్తికరంగా జరుగుతుంది. దేశమంతా సీతారాముల ఉత్సవమూర్తులకు కల్యాణం జరిగితే ఇక్కడ మాత్రం చెట్లు చేమలను దేవతలుగా భావించి కొలుస్తారు. ఈ సంప్రదాయం చాలా కాలంగా వస్తోంది. బుట్టాయగూడెం మండలంలో ఉన్న లక్ష్మీపురం ఉంటుంది. ఇక్కడ గిరిజన సంప్రదాయ పద్ధతిలో శ్రీరామ నవమి వేడుకలు నిర్వహిస్తారు.
శ్రీ సీతారాముల విగ్రహాలుండవు. నవమి ఉత్సవాల పేరిట కల్యాణ క్రతువు నిర్వహిస్తారు. శ్రీరామనవమికి ముందు ఉత్సవ కమిటీ సభ్యు లుగా ఉన్న పెద్దలు, యువకులు అడవికి వెళ్ళి సండ్ర, పాల, ఊడిగ, రావి చెట్ల మానులను సేకరిస్తారు. వాటికే పూజ చేస్తారు. సండ్రను శ్రీరాముడికి, పాల చెట్టును సీతమ్మకు, ఊడిగను లక్ష్మణుడికి, రావి చెట్టు మానును ఆంజనేయుడిగా చెక్కుతారు. ఈ సంప్రదాయం ఇక్కడ ఈనాటిది కాదు.. తరతరాలుగా వస్తోంది.ఈ గ్రామంలో 50 కుటుంబాల వారు ఉంటారు. వారంతా నాయకపోడు తెగకు చెందినవారే. వీరు చెట్లను దేవుళ్లుగా భావించి కొలుస్తారు. గ్రామదేవత గంగానమ్మ తరువాత గిరిజనులు, సీతారామ, లక్ష్మణ, ఆంజనేయుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు.